దాదాపు ఏడాదిగా పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలతో బిజీ అయిపోయారు. ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పదవితో మరికొన్ని కీలక శాఖలు కూడా చేపట్టడంతో ఇంకా బిజీ అయిపోయారు. దీంతో పవన్ కళ్యాణ్ చేస్తున్న హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు మళ్ళీ ఎప్పుడు మొదలుపెడతారో ఎప్పుడు పూర్తి చేస్తారో కూడా తెలీని పరిస్థితి నెలకొంది.
హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నంని మీడియా ప్రతినిధులు ఇదే అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే, “హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రకు సంబందించి మరికొన్ని సన్నివేశాలు షూట్ చేయవలసి ఉంది. వాటి కోసం పవన్ కళ్యాణ్ 20-25 రోజులు సమయం కేటాయిస్తే సినిమా పూర్తయిపోతుంది. కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉన్నందున ఆయన వీలుని బట్టి షూటింగ్ ప్రారంభించాలని ఎదురుచూస్తున్నాము.
ఈలోగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసేస్తునాము. ఈ సినిమాలో ఛార్మినార్ సన్నివేశాలకు సంబందించి సీజీ వర్క్స్ పనులు హైదరాబాద్లో, మచిలీపట్నం పోర్టుకి సంబందించి పనులు ఇరాన్లో, కుస్తీ పోటీలకు సంబందించి వీఎఫ్ఎక్స్ పనులు బెంగళూరులో జరుగుతున్నాయి.
కనుక పవన్ కళ్యాణ్ సమయం కేటాయిస్తే ఈ ఏడాది డిసెంబర్లో హరిహర వీరమల్లు సినిమా తప్పకుండా విడుదల చేయదనైకి ప్రయత్నిస్తాము. ఈ సినిమా ఓటీటీ హక్కులు అమెజాన్ ప్రైమ్కు ఇచ్చాము. కనుక సినిమా విడుదలకు మరి కొన్ని నెలలు సమయం ఇవ్వాలని అమెజాన్ ప్రైమ్ సంస్థని కోరబోతున్నాము,” అని చెప్పారు.
మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ సినిమా మొదలుపెట్టి సగానికిపైగా పూర్తి చేశారు. కానీ సినిమా షూటింగ్ నిలిచిపోవడంతో ఆయన స్థానంలో ఇప్పుడు ఏఎం జ్యోతీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.