బాహుబలి సినిమాలో ప్రభాస్, దగ్గుబాటి రానా, ఆర్ఆర్ఆర్ సినిమాలో జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ నట విశ్వరూపం చూపగా, ఆ రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన రాజమౌళి పేరు ఆస్కార్ అవార్డుతో యావత్ ప్రపంచమంతా మారుమ్రోగిపోయింది. ఇప్పుడు రాజమౌళి దంపతులకు మరో అరుదైన గౌరవం లభించింది. అదికూడా... ఆస్కార్ అవార్డుల కమిటీ నుంచే కావడం విశేషం.
ఈ ఏడాది 57 దేశాల నుంచి 487 మంది సినీ ప్రముఖులను ఆస్కార్ అవార్డుల కమిటీలో సభ్యులుగా ఉంటారు. వారిలో భారత్ నుంచి రాజమౌళి దంపతులు కూడా ఉన్నారు. దర్శకుల విభాగంలో రాజమౌళిని, కాస్ట్యూమ్స్ డిజైనర్ విభాగంలో రమా రాజమౌళిని ‘ఆస్కార్ అకాడమీ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్’ సభ్యులుగా ఆహ్వానం అందుకున్నారు. వీరితో పాటు భారత్ నుంచి షబానా ఆజ్మీ, రితేష్ సిద్వానీ, రవివర్మన్ తదితరులకు కూడా అకాడమీలో సభ్యులుగా ఆహ్వానాలు అందాయి.
గత ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తర్వాత దానిలో నటించిన రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్లతో పాటు సంగీత దర్శకుడు కీరవాణి, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్లకు అకాడమీలో సభ్యత్వం లభించిన సంగతి తెలిసిందే.