షాద్ నగర్‌ గ్లాస్ ఫ్యాక్టరీలో ఆరుగురు కార్మికులు మృతి

June 29, 2024
img

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌ పారిశ్రామికవాడలో గల సౌత్ గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. కర్మాగారంలో గ్యాస్ కంప్రెస్ చేస్తుండగా భారీ శబ్ధంతో సిలిండర్ పేలిపోయి మంటలు ఎగసిపడ్డాయి. ప్రేలుడు ధాటికి కర్మాగారం పైకప్పు కూలిపోయింది.

ఆ సమయంలో అక్కడే పనిచేస్తున్న ఆరుగురు కార్మికులు ఘటనాస్థలంలోనే చనిపోగా మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం జరిగినప్పుడు కర్మాగారంలో మొత్తం 150 మంది కార్మికులు లోపల పనిచేస్తున్నట్లు సమాచారం. కానీ అదృష్టవశాత్తు వారందరూ స్వల్పగాయాలతో బయటపడ్డారు. 

ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని ఫైర్ ఇంజన్లతో సుమారు రెండు మూడు గంటలు శ్రమించి మంటలను ఆర్పివేశారు. పోలీసులు కూడా హుటాహుటిన అక్కడకు చేరుకొని అంబులెన్సులలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని ఈ ప్రమాదానికి కారణం కనుగొనేందుకు దర్యాప్తు ప్రారంభించారు. 

Related Post