బిహార్ రాష్ట్రంలో ప్రపంచంలోనే సరికొత్త రికార్డ్ నెలకొల్పుతోంది. కేవలం 24 గంటలలోనే మూడు వంతెనలు, కేవలం 17 రోజులలో 12 వంతెనలు నిర్మించలేదు.... కూలిపోయాయి. ఇంత తక్కువ సమయంలో వరుసగా ఇన్ని వంతెనలు కూలిపోవడం కూడా సరికొత్త రికార్డే. ఈ క్రెడిట్ బిహార్ని పాలిస్తున్న నితీష్ కుమార్కే దక్కుతుంది. ఒక్క శరణ్ జిల్లాలోనే గత 24 గంటలలో మూడు వంతెనలు కూలిపోయాయి.
గండకీ నదిపై నిర్మించిన ఈ వంతెన నిన్న కూలిపోవడంతో ఇప్పటి వరకు బిహార్లో మొత్తం 12 వంతెనలు కూలిన్నట్లయింది.
బ్రిటిష్ కాలంలో నిర్మించిన పలు వంతెనలు నేటికీ వరదలు, ఒత్తిడి తట్టుకొని నిలబడే ఉంటున్నాయి. కానీ బిహార్లో తాజాగా కూలిపోయిన వంతెన నిర్మించి కేవలం 15 ఏళ్ళు మాత్రమే అయ్యింది. వరుసగా 12 వంతెనలు కూలిపోవడంతో ఇప్పుడు ప్రజలు వంతెనలపై ప్రయాణించాలంటేనే భయపడిపోతున్నారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు లంచాలకు ఆశపడటం వలననే నాసిరకంగా వంతెనల నిర్మాణాలు జరిగి ఉండవచ్చని, అందుకే చిన్నపాటి వరదలకే కొట్టుకుపోతున్నాయని బిహార్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిహార్ సిఎం నితీష్ కుమార్ ఈ వంతెనల కూలిపోవడంపై విచారణకు ఆదేశించిన రోజునే శరణ్ జిల్లాలో గండకీ నదిపై వంతెన కూలిపోయింది. బిహార్లో ఇంకెన్ని వంతెనలు కూలిపోతాయో?