సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని ప్రజలు నివసించే ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికోసం విధివిధానాలను కూడా జారీ చేసింది.
రక్షణశాఖ అదనపు డైరెక్టర్ జనరల్ హేమంత్ యాదవ్ జూన్ 28వ తేదీన ఈ మేరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఈవోకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు.
తాజా ఉత్తర్వుల ప్రకారం ఇప్పటి వరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న జనావాసాలన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తాయి. ఆ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల నిర్వహణ బాధ్యతలన్నీ ఇకపై జీహెచ్ఎంసీ చేపడుతుంది.
అలాగే ఆ ప్రాంతాలలో వ్యాపార సంస్థలతో చేసుకున్నా లీజు ఒప్పందాలన్నీ కూడా జీహెచ్ఎంసీకి బదిలీ అవుతాయి. కానీ సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మిలటరీ స్టేషన్, భద్రత దళాలు ఉండే ప్రాంతాలు, వాటి పరిధిలో భూములు, ఆస్తులు అన్నీ కేంద్ర ప్రభుత్వానికే చెందుతాయి.
జీహెచ్ఎంసీలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీనానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి విధివిధానాలు కూడా జారీ చేసినందున త్వరలోనే బోర్డు, జీహెచ్ఎంసీ అధికారులు సమావేశమయ్యి ఈ విలీన ప్రక్రియపై చర్చించనున్నారు. ఆ తర్వాత జీహెచ్ఎంసీ అధికారులు విలీన ప్రక్రియ మొదలుపెడతారు.