కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ కమీషన్ గడువు నేటితో ముగియనుంది. కానీ విచారణ ఇంకా పూర్తవకపోవడం, ఆర్ధిక, సాంకేతిక అంశాలపై మరింత లోతుగా విచారణ జరిపించాల్సి ఉన్నందున కమీషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు నెలలు అంటే ఆగస్ట్ 31వరకు పొడిగించింది.
ఈ మేరకు సాగునీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా శనివారం జీవో :14 జారీ చేశారు. కనుక జూలై మొదటి వారం నుంచి జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ కమీషన్ కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ ప్రారంభించనుంది.
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, బిఆర్ఎస్ నేతలు ఎంతో గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులో మొట్ట మొదటిదైన మేడిగడ్డ బ్యారేజిలో మూడు పియర్స్ వారి హయాంలోనే క్రుంగిపోగా, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలకు భారీ పగుళ్ళు ఏర్పడి నీళ్ళు లీక్ అయిపోతున్నాయి.
ప్రస్తుతం ఎగువన మహారాష్ట్ర నుంచి భారీగా వరద నీరు మేడిగడ్డ బ్యారేజిలోకి వస్తుండటంతో బ్యారేజీలో నీళ్ళు నిలువచేయలేని పరిస్థితి నెలకొంది. బ్యారేజీలో అన్ని గేట్లు ఎత్తి నీటిని బయటకు విడుదల చేస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇన్ని వేలకోట్లు ఖర్చు చేసినా కేసీఆర్ ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తిపడి నాసి రకం పనులు చేయడం వలననే నేడు ఇటువంటి సమస్యలు వస్తున్నాయని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపిస్తోంది.