మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ (76) ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్లోని తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. గత కొంతకాలం ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.
తెలంగాణ రాజకీయాలలో డీఎస్గా సుపరిచితులైన ధర్మపురి శ్రీనివాస్ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, మంత్రిగా, అధ్యక్షుడుగా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రానికి సేవలు అందించారు. రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. 2015లో ఆయన రాజ్యసభ సభ్యుడుగా ఎన్నికయ్యారు. కానీ ఆ తర్వాత బిఆర్ఎస్ పార్టీలో తీవ్ర అవమానాలు ఎదురవుతుండటంతో ఆయన పార్టీకి దూరం అయ్యారు.
ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో చేరారు కానీ వృద్ధాప్య సంబందిత ఆరోగ్య సమస్యల కారణంగా రాజకీయాలలో పాల్గొనలేదు.
ధర్మపురి శ్రీనివాస్ ఇద్దరు కుమారులలో ఒకరు సంజయ్ నిజామాబాద్ మేయర్గా పనిచేయగా రెండవ కుమారుడు బీజేపీలో చేరి నిజామాబాద్ నుంచి వరుసగా రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.