మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత కొంతకాలంగా కిడ్నీ, మూత్రకోశ సంబందిత సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. బుధవారం రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఢిల్లీ, ఎయిమ్స్ హాస్పిటల్లో చేర్చారు. ఆయనను ప్రైవేట్ వార్డులోని ఐసీయూలో ఉంచి యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ అమలేశ్ సేథ్ వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు చెప్పారు.
అద్వానీ వయసు 96 సంవత్సరాలు. 2014 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ విజయం సాధించి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అద్వానీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు. ఆ తర్వాత వృద్ధాప్య సంబందిత ఆరోగ్య సమస్యలు మొదలవడంతో రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నారు.