ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గత మూడున్నర నెలలుగా తిహార్ జైల్లోనే ఉంటున్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇప్పట్లో బెయిల్ లభించే సూచనలు కనిపించడం లేదు. నేటితో ఆమె జ్యూడిషియల్ రిమాండ్ ముగియడంతో జైలు అధికారులు ఆమెను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.
ఈ నెల 25వరకు ఆమె జ్యూడిషియల్ రిమాండ్ పొడిగిస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించి తదుపరి విచారణను అప్పటికి వాయిదా వేశారు. మరోపక్క ఢిల్లీ హైకోర్టు కూడా ఆమె రెండు బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. కనుక ఆమెకు ఇంకా ఎప్పటికీ బెయిల్ దొరుకుతుందో తెలీని పరిస్థితి నెలకొంది.
ఇదివరకు ఆమెకు ఈడీ విచారణకు హాజరుకమ్మని నోటీస్ పంపిస్తేనే హైదరాబాద్ నగరం అంతటా ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టి బిఆర్ఎస్ పార్టీ చాలా హడావుడి చేసేది. కానీ ఆమె మూడున్నర నెలలుగా జైల్లోనే ఉండిపోయినప్పటికీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులతో సహా పార్టీలో ఎవరూ ఆమె గురించి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు గురించి ఒక్క ముక్క మాట్లాడకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. మూడున్నర నెలలుగా కూతురు జైల్లో ఉన్నప్పటికీ కేసీఆర్ ఇంతవరకు ఒక్కసారి కూడా ఢిల్లీ వెళ్ళి ఆమెను పరామర్శించకపోవడం ఇంకా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ విషయంలో కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారో? ఆయన మౌనానికి అర్దం ఏమిటో ఆయనే చెప్పాలి.