రిలయన్స్ జియో మొబైల్ ఫోన్ రీఛార్జ్ ప్లాన్స్ ధరలు పెంచుతున్నట్లు నిన్న ప్రకటించింది. ఊహించిన్నట్లుగానే 24 గంటలు గడువక ముందే ఎయిర్ టెల్ కూడా ప్రీ-పెయిడ్, పోస్ట్ పెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది.
జియో 12-25% వరకు ఛార్జీలు పెంచగా, ఎయిర్ టెల్ 10 నుంచి 21% మాత్రమే పెంచుతున్నట్లు ప్రకటించింది. జూలై 3 వ తేదీ నుంచే రెండు సంస్థలు పెంచిన కొత్త ఛార్జీలు అమలులోకి వస్తాయి.
ఒక్కో వినియోగదారుడు నుంచి కనీసం రూ.300లకు పైగా ఆదాయం వస్తేనే సంస్థ నష్టపోకుండా మనుగడ సాగించగలదని ఎయిర్ టెల్ సంస్థ తెలిపింది. ఈ పెంపు వలన వినియోగదారులపై రోజుకి 70 పైసలు మాత్రమే అదనపు భారం పడుతుందని తెలిపింది.
తాజా పెంపు ప్రకారం ప్రస్తుతం నెలకు రూ.179 ప్లాన్ ఇకపై రూ.199 అవుతుంది. అదేవిదంగా రూ.455 ప్లాన్ ధర రూ.509, రూ. 265 ప్లాన్ ధర ఇకపై రూ. 299 అవుతుంది. పెంచిన చార్జీల పూర్తి వివరాల కోసం ఎయిర్ టెల్ మొబైల్ యాప్ లేదా ఆ సంస్థ అధికారిక వెబ్సైట్లో చూడవచ్చు.